RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78528311

ద్రవ్య విధాన నివేదిక, 2021-22 ద్రవ్య విధాన కమిటీ (ఎమ్ పి సి) తీర్మానము జూన్ 2-4, 2021

తేదీ: 04/06/2021

ద్రవ్య విధాన నివేదిక, 2021-22
ద్రవ్య విధాన కమిటీ (ఎమ్ పి సి) తీర్మానము జూన్ 2-4, 2021

ప్రస్తుత మరియు రాబోయే స్థూల ఆర్థిక పరిస్థితులపై అంచనాల ఆధారంగా, ద్రవ్య విధాన కమిటీ (ఎం పి సి) ఈనాటి (జూన్ 04, 2021) సమావేశంలో, ఈ క్రింది విధంగా నిర్ణయించింది:

  • లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్ ఫెసిలిటీ (ఎల్ ఏ ఎఫ్, liquidity adjustment facility, LAF) క్రింద పాలిసీ రెపో రేట్, మార్పులేకుండా 4.0 శాతంగానే ఉంచవలెను.

అందువల్ల, ఎల్ ఏ ఎఫ్ క్రింద, రివర్స్ రిపో రేట్ మార్పులేకుండా 3.35 శాతంగానే ఉంటుంది; మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) మరియు బ్యాంక్ రేట్లు, 4.25 శాతంగా ఉంటాయి.

  • ఇంతేగాక, ఇకపై ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించకుండా జాగ్రత్త వహిస్తూ, ఆర్థిక వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని ఉపశమింపచేస్తూ, దీర్ఘకాల అభివృద్ధిని పునరుద్ధరించుటకొరకు, అవసరమయినంత కాలం సానుకూల ధోరణితో వ్యవహరించాలని, ఎమ్ పి సి నిర్ణయించింది.

ఎమ్‌ పి సి యొక్క ఈ నిర్ణయం, అభివృద్ధికి ఊతం ఇస్తూ, వినియోగదారుల ధరల సూచీలో (CPI) మధ్యకాలీన ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతం (+/- 2 శాతం పరిమితిలో) సాధించడానికి, ద్రవ్య విధానం తటస్థంగా ఉండాలి అన్న ఉద్దేశానికి అనుగుణంగా తీసికోవడం జరిగింది.

ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణాలు ఈ క్రింద వివరించబడ్డాయి.

అంచనా

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

2. ఏప్రిల్ లో జరిగిన క్రిందటి ఎం పి సి సమావేశం తరువాత, ముఖ్యంగా, అభివృద్ధి చెందిన దేశాల (ఏ ఇ, అడ్వాన్‌స్డ్ ఎకానమీస్) ప్రేరణతో మరియు పెద్ద ఎత్తున చేపట్టిన టీకా కార్యక్రమాలు, ఉద్దీపనల కారణంగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకొంటోంది. ప్రధాన ఎమెర్జింగ్ మార్కెట్ ఎకానమీస్‌లో, (ఇ ఎం ఇ) లలో, ఉత్పరివర్తన (మ్యుటేషన్) చెందిన కొత్త వైరస్ లు మళ్ళీ విజృంభిస్తున్న కారణంగా మరియు టీకా కార్యక్రమం మందకొడిగా సాగడంచేత, ఆర్థిక కార్యకలాపాలు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. విదేశీ గిరాకీ పెరిగిన కారణంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తు వాణిజ్యం కోలుకొంటోంది. అయితే, పెరిగిన రవాణా ఖర్చులు, కంటైనర్ల లభ్యతలోగల సమస్యలు, అడ్డంకులుగా నిలుస్తున్నాయి. అనేక ఏ ఇ లలో, ప్రోగుపడ్డ గిరాకీ ఒక్కసారి విడుదల కావడం, తయారీ ఖర్చులు పెరగడం, ప్రతికూలమైన ‘బేస్ ఎఫెక్ట్’ కారణంగా, వినియోగదారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం (సి పి ఐ ఇన్ఫ్లేషన్) పెరుగుతోంది. ఆహార మరియు వస్తువుల ధరలు స్థిరంగా పెరుగుతున్న కారణంగా, ముఖ్యమైన ఇ ఎమ్ ఇ లలో, ఇటీవలి నెలలలో ద్రవ్యోల్బణం అధికారిక లక్ష్యాలకు దగ్గరగా లేదా అంతకుమించి ఉంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయి.

దేశీయ ఆర్థిక పరిస్థితి

3. దేశ ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే, జాతీయ గణాంక కార్యాలయం (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్) మే 31, 2021 తేదీన విడుదలచేసిన తాత్కాలిక అంచనాల ప్రకారం, వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి (జి డి పి) 2020-21 సంవత్సరంలో 7.3 శాతం సంకోచించింది. కానీ, నాలుగో త్రైమాసికంలో, జి డి పి క్రితం సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే (ఈయర్ ఆన్ ఈయర్, వై-ఓ-వై) 1.6 శాతం పెరిగింది. జూన్ 1 తేదీన భారత వాతావరణ సంస్థ, నైరుతి ఋతు పవనాలు సాధారణంగాఉండి, దీర్ఘకాలిక సగటు (ఎల్ పి ఏ) కన్నా 101 శాతం వర్షాలు పడతాయని, సూచించింది. వ్యవసాయానికి ఇది శుభసూచకం. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో, కోవిడ్ వ్యాధి ప్రబలడంవల్ల, గ్రామీణ గిరాకీని సూచించే ట్రాక్టర్ అమ్మకాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు, వరుసగా ఏప్రిల్ నెలలోకూడా తగ్గాయి.

4. పారిశ్రామిక ఉత్పత్తి, స్థూలంగా చూస్తే మార్చి 2021 లో మెరుగయింది. గనుల, విద్యుచ్ఛక్తి ఉత్పాదన మార్చి 2019 కన్నా (మహమ్మారికి ముందు) అధికమయినా తయారీ రంగం వెనుకబడే ఉంది. కీలక పరిశ్రమల ఉత్పాదన, ఏప్రిల్ 2021 లో (వై-ఓ-వై) రెండంకెల అభివృద్ధి సాధించింది (నిరుటి సంవత్సరం బలహీనమైన ఉత్పాదనతో పోలిస్తే). వస్తు సేవల పన్ను (జి ఎస్ టి) వసూళ్లు, ఏప్రిల్ 2021 లో అత్యధికమైనా, ఈ-వే బిల్స్ తగ్గడం, మే నెలలో వసూళ్లు తగ్గవచ్చని సూచిస్తోంది. ఇతర హై ఫ్రీక్వెన్సీ సూచికలు:- విద్యుదుత్పత్తి; రైల్వే వస్తు రవాణా; ఓడరేవుల్లో సరకు రవాణా; ఉక్కు వినియోగం; సిమెంట్ ఉత్పత్తి; దారి సుంకం (టోల్) వసూళ్లు, ఏప్రిల్-మే 2021 లో వరసగా తగ్గుతూ వచ్చాయి. వివిధ రాష్ట్రాలు, విధించిన నిర్బంధనలు (ప్రత్యేక కార్యకలాపాలకు మినహాయింపుతో), కొన్ని ప్రాంతాలలో లాక్ డౌన్లు దీనికి కారణం. మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మానేజర్స్ ఇండెక్స్ (పి ఎమ్ ఐ), ఏప్రిల్ నెలలో ఉత్పాదన నెమ్మదించడం, కొత్త ఆర్డర్లు లేకపోవడం వల్ల, 55.5 నుంచి 50.8 కి తగ్గినాగాని, మే నెలలో పెరుగుతూ ఉంది. సేవల పి ఎమ్ ఐ, ఏప్రిల్ నెలలో 54.0 నుంచి, మే నెలలో 46.4 కి తగ్గింది (ఏడు నెలలు పెరిగిన తరువాత).

5. మూలాలు అనుకూలంగా ఉన్న కారణంగా, మార్చ్ నెలలో 5.5 శాతంగా ఉన్న ‘హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్’, ఏప్రిల్ నెలలో 4.3 శాతానికి తగ్గింది. పప్పులు, కూరగాయలు, పంచదార ధరలు గత సంవత్సరంతో పోలిస్తే తగ్గుముఖం పడుతూ ఉండడంవల్ల, మార్చిలో 5.2 శాతం ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఏప్రిల్ లో 2.7 శాతానికి పడిపోయింది. ఇంధన ద్రవ్యోల్బణం దూసుకుపోయినా, కోర్ ద్రవ్యోల్బణం (అనగా వినియోగదారుల ద్రవ్యోల్బణం నుంచి, ఆహారం, ఇంధనం మినహాయించి) ఏప్రిల్ నెలలో అన్ని ఉప వర్గాలలో (గృహ నిర్మాణం, ఆరోగ్యం తప్ప) మూలాలు బాగున్న కారణంగా, తగ్గుదల చూపింది. అయితే, రవాణా, సమాచార రంగాలలో ద్రవ్యోల్బణం రెండంకెలలో కొనసాగుతోంది.

6. వ్యవస్థలో ద్రవ్యత ఏప్రిల్, మే 2021 నెలలలో చాలా మిగులులో ఉంది. లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ (ఎల్ ఏ ఏఫ్, LAF) క్రింద, సగటు రోజువారీ గ్రహించిన ద్రవ్యత రూ. 5.2 లక్షల కోట్లు. కరెన్సీ గిరాకీ అధికమయిన కారణంగా, మే 28, 2021 తేదీన, గత సంవత్సరంతో పోల్చినప్పుడు, రిజర్వ్ మనీ (నగదు నిల్వల నిష్పత్తి మారిన కారణంగా, మొదటి దఫా, కలిగే తాకిడికి సర్దుబాటుచేసిన తరువాత) 12.4 శాతం పెరిగింది. క్రిందటి సంవత్సరం వరుసగా 11.7, 6.2 శాతం పెరిగిన ద్రవ్య సరఫరా, (M3), మరియు బ్యాంక్ రుణాలు మే 21, 2021 తేదీన వరుసగా 9.9, 6.0 శాతం పెరిగాయి. విదేశీ మారక నిల్వలు 2021-22 లో (మే 28 వరకు) US $ 21.2 బిలియన్లు పెరిగి, US$ 598.2 బిలియన్లు చేరుకొన్నాయి.

దృక్పథం

7. రానున్న కాలంలో, ద్రవ్యోల్బణం హెచ్చు తగ్గులు అనిశ్చిత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ప్రత్యేకించి, అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని పైకి నెట్టే ప్రమాదం ఉంది. పెట్రోల్, డీసెల్ ధరల పెరుగుదలవల్ల, పెరిగే ఉత్పాదక వ్యయం నియంత్రించడానికి, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ఎక్సైజ్ డ్యూటీలు, సెస్, పన్నులు, సమన్వయంతో సర్దుబాటు చేయాలి. నైరుతి ఋతుపవనాలు, సాధారణంగా ఉండటం, ఆహారనిల్వలు సంతృప్తికరంగా ఉండటం, పప్పు ధాన్యాల ధరలు స్థిరంగా ఉండటానికి తోడ్పడతాయి. ఇటీవల తీసికొన్న చర్యలు, కాయధాన్యాల సరఫరాలో ఇబ్బందులని తగ్గిస్తాయి. పప్పుధాన్యాలు, వంట చమురు ధరలు తగ్గాలంటే, వాటి సరఫరాలోగల సమస్యలు చక్కదిద్దుటకు మరి కొన్ని చర్యలు అవసరం. మహమ్మారి తగ్గడంతో ప్రాంతీయంగా విధించిన నిర్బంధాలు, లాక్ డౌన్లు క్రమేపీ సడలించబడి, సరఫరాలోగల అంతరాయాలు తొలగి ధరలు తగ్గుతాయి. గిరాకీ తగ్గడం కారణంగాకూడా, కోర్ ఇన్ఫ్లేషన్ మితం కావచ్చు. పై అంశాలు పరిగణనలోకి తీసికొని, వినియోగదారుల ధరల సూచీ 2021-22 సంవత్సరంలో 5.1 శాతం ఉండవచ్చని అంచనా - మొదటి త్రైమాసికంలో, 5.2 శాతం; రెండవ త్రైమాసికం, 5.4 శాతం; మూడవ త్రైమాసికం, 4.7 శాతం మరియు aa నాలుగవ త్రైమాసికం, 5.3 శాతం. (చార్టు 1)

8. అభివృద్ధి విషయానికి వస్తే, గ్రామీణ గిరాకీ బలంగా ఉంది. వర్షాపాతం సాధారణంగా ఉంటుందన్న అంచనావల్ల, ఇకపైకూడా ఇది ఇలాగే కొనసాగుతుంది. అయితే, అనేక గ్రామీణ ప్రాంతాలలో కోవిడ్ 19 పెరుగుతున్న కారణంగా గిరాకీ పడిపోవచ్చు. రెండో దశ కోవిడ్ ఉధృతి కారణంగా, పట్టణాలలో గిరాకీ దెబ్బతింది. వాణిజ్య సంస్థలు, కోవిడ్ సోకకుండా పని తీరులో చేసిన మార్పులవల్ల, ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభావం లేకపోవచ్చు, ప్రత్యేకించి ప్రత్యక్ష సంపర్కం అవసరంలేని, తయారీ / సేవా రంగాలలో. మరో వైపు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కోలుకొంటున్నందువల్ల, ఎగుమతులు ఊపందుకోవచ్చు. ఇంతేగాక, రాబోయే నెలలలో, టీకా కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతుందిగనుక, ఆర్థిక వ్యవస్థ త్వరలో సాధారణ స్థితికి వస్తుంది. ఈ విషయాలన్నీ లెక్కలోకి తీసికొని, వాస్తవ స్థూల జాతీయ (రియల్ జి డి పి) ఉత్పత్తిలో అభివృద్ధి 2021-22 సంవత్సరానికి, 9.5 శాతంగా అంచనా వేయబడింది (మొదటి త్రైమాసికం-18.5 శాతం; రెండవ త్రైమాసికం - 7.9 శాతం; మూడవ త్రైమాసికం-7.2 శాతం; నాల్గవ త్రైమాసికం-6.6 శాతం). (చార్ట్ 2)

Chart 1

Chart 2

9. కోవిడ్-19 రెండో దశ, సమీప కాల అంచనాలను తలక్రిందులు చేసిందని ఎమ్ పి సి గమనించింది. ఈ పరిస్థితిలో, సరఫరా ఇబ్బందులు తలెత్తకుండా, రిటైల్ మార్జిన్లు పెరగకుండా చూడాలంటే, విధానాలలో తక్షణ మార్పు, క్రియాత్మక పర్యవేక్షణ, సకాల చర్యలు అవసరం. ప్రజల ప్రాణాలు, జీవనోపాధులు కాపాడడానికి, కొత్త రకాల కోవిడ్ వ్యాప్తి అరికట్టడానికి, టీకా కార్యక్రమాల వేగాన్ని పెంచడం, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక ఆరోగ్య వ్యవస్థ బలోపేతం చేయడం, కీలకం. ఈ సమయంలో, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి తిరిగి సాధారణ స్థితికి తేవడానికి, అన్ని వైపులనుండి - ద్రవ్య, ఆర్థిక, వర్గ సహకార విధానాలు, అవసరం. తదనుసారంగా, ఎమ్ పి సి, ప్రస్తుత రెపో రేట్ 4 శాతాన్ని మార్పులేకుండా ఉంచి, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పుంజుకొనేవరకు, సానునయ విధానాన్ని అనుసరిస్తూ, వచ్చే కాలంలో ద్రవ్యోల్బణ లక్ష్యం పెరగకుండా, వ్యవస్థపై కోవిడ్-19 ప్రభావాన్ని ఉపశమింప చేయడానికి ప్రయత్నించాలని నిశ్చయించింది.

10. ఎమ్ పి సి లోని అందరూ సభ్యులు – డా. శశాంక్ భిడే, డా. అషిమా గోయిల్, ప్రో. జయంత్ ఆర్ వర్మ, డా. మృదుల్ కె సగ్గర్, డా. మైకేల్ దేబబ్రత పాత్రా మరియు శ్రీ శక్తికాంత దాస్ – పాలిసీ రెపోరేట్ మార్చకుండా 4.0 శాతంగానే ఉంచాలని ఏకగ్రీవంగా వోట్ చేశారు. ఇంతేగాక, ఆర్థిక వ్యవస్థ స్థిరంగా పుంజుకొనేవరకు, అవసరమయినంతకాలం సానునయ విధానాన్ని అనుసరిస్తూ, ద్రవ్యోల్బణ లక్ష్యం పెరగకుండా, వ్యవస్థపై కోవిడ్ ప్రభావాన్ని ఉపశమింప చేయడానికి ప్రయత్నించాలని కూడా ఏకగ్రీవంగా వోట్ చేశారు.

11. సమావేశం యొక్క వ్యవహార సంగ్రహం (మినిట్స్) జూన్ 18, 2021 తేదీన ప్రచురించబడుతుంది.

12. ఎమ్ పి సి తదుపరి సమావేశం, ఆగస్ట్ 4 – 6, 2021 తేదీల మధ్యలో జరుగుతుంది.

(యోగేశ్ దయాల్) 
చీఫ్ జనరల్ మానేజర్

పత్రికా ప్రకటన: 2021-2022/318

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?