<font face="mangal" size="3">పురోగమనశీల మరియు నియంత్రణ విధానాలపై నివేది - ఆర్బిఐ - Reserve Bank of India
పురోగమనశీల మరియు నియంత్రణ విధానాలపై నివేదిక
తేదీ: 04/06/2021 పురోగమనశీల మరియు నియంత్రణ విధానాలపై నివేదిక ఈ నివేదిక, (i) ద్రవ్యత నిర్వహణ మరియు లక్షిత వర్గాలకు సహాయం (ii) నియంత్రణ మరియు పర్యవేక్షణ (iii) ఆర్థిక విపణులు మరియు (iv) చెల్లింపు వ్యవస్థలకు సంబంధించి చేపట్టిన వివిధ పురోగమనశీల మరియు నియంత్రణ చర్యలను వివరిస్తుంది. I. ద్రవ్యతకు సంబంధించిన చర్యలు 1. వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే సేవా రంగాలకు, నిరంతరం (ఆన్ ట్యాప్) లభించే ద్రవ్యత సౌకర్యం. కోవిడ్ కి సంబంధించి మౌలిక వైద్య సదుపాయాలు / సేవలు పెంపొందించుటకొరకు తక్షణ ద్రవ్యత లభించేలా, రూ. 50,000 కోట్లతో, మూడు సంవత్సరాల గరిష్ఠ కాలపరిమితితో, రెపో రేటుకు నిరంతరం లభించే ద్రవ్యత సదుపాయం ఏర్పాటుచేయాలని, మే 5, 2021 తేదీన నిశ్చయించబడింది. ఇప్పుడు, రూ. 15,000 కోట్లతో మూడు సంవత్సరాల వరకు కాలపరిమితితో, నిరంతరం రెపో రేటుకు లభించే మరొక ప్రత్యేక ద్రవ్యత సదుపాయం కల్పించాలని, నిశ్చయించబడింది. ఈ సదుపాయం, వ్యక్తుల ప్రత్యక్ష కలయిక అనివార్యమయే ప్రత్యేక సేవా రంగాలకై ఉద్దేశించబడింది. అనగా, హోటళ్ళు మరియు రెస్టారెంట్లు; పర్యటన – పర్యాటన ఏజంట్లు; విహార యాత్రా నిర్వాహకులు; సాహస / సాంస్కృతిక యాత్రా సదుపాయాలు; విమానయాన మరియు తత్సంబంధిత సేవలు - ప్రయాణీకుల మరియు సరఫరా నిర్వహణ; ప్రైవేటు బస్ నిర్వాహకులు, కారు మరమ్మత్తు / అద్దె కారు సేవలు; కార్యక్రమాల / సమావేశాల నిర్వాహకులు; ఆరోగ్య చికిత్సశాలలు; సౌందర్య పోషణ కేంద్రాలు / క్షవరశాలలు మొదలైనవి. బ్యాంకులు, ఈ పథకంక్రింద ప్రత్యేక ‘కోవిడ్ లోన్ బుక్’ ప్రారంభించాలి. ఇందుకు ప్రోత్సాహకంగా, బ్యాంకులు ‘కోవిడ్ లోన్ బుక్’ విలువమేరకు, వారి వద్ద గల అధిక ద్రవ్యతను, రెపో రేటుకన్న 25 బేసిస్ పాయింట్ల తక్కువ రేటుకు రెవర్స్ రెపోలో లేదా మరో రకంగా చెప్పాలంటే, రెవర్స్ రెపో రేటుకన్న 40 బేసిస్ పాయింట్లు ఎక్కువరేటుకు, దాచి ఉంచుకోవచ్చు. రిజర్వ్ బ్యాంకునుండి నిధులు కోరకుండా, వారి స్వంత నిధులనుండి పైన తెలిపిన రంగాలకు రుణాలు జారీచేయాలనుకొన్న బ్యాంకులుకూడా, ఈ సదుపాయానికి అర్హులు. 2. ఎస్ ఐ డి బి ఐ కి (సిడ్బి కి), ప్రత్యేక ద్రవ్యత సౌకర్యం చిగురిస్తున్న ఆర్థిక అభివృద్ధిని ఫలోపేతం చేసే ఉద్దేశంతో, 2021-22 లో క్రొత్త రుణాలు మంజూరు చేయడానికి, జాతీయ ఆర్థిక సంస్థలకు ఏప్రిల్ 7, 2021 న రిజర్వ్ బ్యాంక్, తాజాగా రూ. 50,000 కోట్ల నిధులు జారీచేసింది. దీనిలో రూ 25,000 కోట్లు, వ్యవసాయ మరియు అనుబంధ కార్యకలాపాలకు; గ్రామీణ వ్యవసాయేతర రంగాలు మరియు వ్యవసాయేతర ఆర్థిక సంస్థలు – సూక్ష్మ ఋణ సంస్థల సౌకర్యం కొరకు ( ఎన్ బి ఎఫ్ సి-ఎమ్ ఎఫ్ ఐ లు), జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకుకు (ఎన్ ఏ బి ఏ ఆర్ డి); రూ. 10,000 కోట్లు గృహ రంగానికి తోడ్పడుటకు నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు; రూ 15,000 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎమ్ ఎస్ ఎమ్ ఇ) అవసరాలకొరకు, ఎస్ ఐ డి బి ఐ కి జారీ చేయబడ్డాయి. ఎమ్ ఎస్ ఎమ్ ఇ ల స్వల్పకాలిక, మధ్యకాలిక ఋణ అవసరాలు కొరకు, ప్రత్యేకించి చిన్న ఎమ్ ఎస్ ఎమ్ ఇ ల పెట్టుబడులు ప్రోత్సహించుట కొరకు, ఎస్ ఐ డి బి ఐ కి మరొక రూ. 16,000 కోట్లు స్పెషల్ లిక్విడిటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించబడింది. ఈ సౌకర్యం, ‘డబుల్ ఇంటర్మీడియేషన్’, ‘పూల్డ్ బాండ్’ / ‘లోన్ ఇస్స్యూఎన్సెస్’ తో సహా ఇతర నూతన విధానాలకు / వ్యవస్థలకు, ఆన్-లెండింగ్ / రిఫైనాన్స్ కొరకు ఉపయోగించబడుతుంది. ఈ సదుపాయం, పాలిసీ రెపో రేటుతో ఒక సంవత్సరం వరకు లభిస్తుంది. దీని వినియోగం ఆధారంగా, రిజర్వ్ బ్యాంక్ ఈ సదుపాయాన్ని పొడిగించవచ్చు. II. నియంత్రణ మరియు పర్యవేక్షణ 3. రిసొల్యూషన్ ఫ్రేమ్ వర్క్ 2.0 క్రింద ఎక్స్పోజర్ త్రెషోల్డ్ పెంపు (పరిష్కార ప్రక్రియ 2.0 ప్రారంభించుటకు, కనీస బకాయివిలువ పరిమితి పెంపుదల) మే 5, 2021 తేదీన రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన పరిష్కార ప్రక్రియ 2.0 ప్రకారం, కోవిడ్ 19 కారణంగా ప్రతి ఎమ్ ఎస్ ఎమ్ ఇ, నాన్-ఎమ్ ఎస్ ఎమ్ చిన్న వ్యాపారాలు, వ్యాపారంకోసం వ్యక్తులకు జారీచేసిన ఒకొక్క రుణం పై బకాయి గరిష్ట మొత్తం రూ. 25 కోట్లకు మించితే, పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలి. ఈ అంశాన్ని సమీక్షించి, ఈ పరిమితి, రూ. 50 కోట్లకు పెంచాలని నిర్ణయించడం జరిగింది. తదనుసారంగా, పై వర్గాలకు చెందిన ఋణ గ్రహీతల బకాయిలు మొత్తం రూ. 50 కోట్లకు మించి, (ఇంతకు ముందు ఏ పథకం క్రింద పునర్వ్యవస్థీకరించబడని రుణాలు) ఉన్నట్లయితే, రిసొల్యూషన్ ఫ్రేమ్ వర్క్ 2.0 క్రింద పరిష్కారానికి అర్హమౌతాయి. ఇతర నిబంధనలలో మార్పులేదు. III. ఆర్థిక విపణులు 4. విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ పి ఐ లు) తరఫున చేసిన ప్రభుత్వ సెక్యూరిటీల లావాదేవీలకు మార్జిన్ భారత ఋణ విపణులలో, విదేశీ మదుపర్ల పెట్టుబడులను ప్రోత్సహించుటకు రిజర్వ్ బ్యాంక్ అనేక చర్యలు తీసికొంటోంది. పెట్టుబడులకు నూతన అవకాశాల కల్పన, నాన్-రెసిడెంట్ల పెట్టుబడులకు సంబంధించి నియమితకాల సమీక్ష, ఇందులో భాగాలు. ఎఫ్ పి ఐ లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించడానికి, కార్యకలాపాలు సులభతరం చేయడానికి, ఆతరైజ్డ్ డీలర్ బ్యాంకులకు, ఎఫ్ పి ఐ ఖాతాదారుల తరఫున జరిపే ప్రభుత్వ సెక్యూరిటీల లావాదేవీలకు (రాష్ట్ర వికాస రుణాలు మరియు ట్రెజరీ బిల్సుతో సహా), క్రెడిట్ రిస్క్ నిర్వహణలో భాగంగా, మార్జిన్ నిర్ణయించుటకు అనుమతించబడినది. 5. డిపాజిట్ సర్టిఫికేట్లు (సి డిలు) జారీచేయువారికి, ద్రవ్యత నిర్వహణలో వెసులుబాటు సరసమైన ధరలలో, సమర్థవంతంగా ద్రవ్యత నిర్వహించుటకు అనువుగా, రిజర్వ్ బ్యాంక్ ద్వారా లభించే ద్రవ్యత సదుపాయాన్ని మరియు కాల్ / నోటీస్ మనీ మార్కెట్లను వినియోగించుకొనుటకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, డిసెంబర్ 2020 లో అనుమతి ఇవ్వబడింది. స్వల్పకాలిక నిధులు సులభంగా సమకూర్చుకొనుటకు, ఆర్ ఆర్ బి లు, అర్హులైన మదుపరులకు డిపాజిట్ సర్టిఫికెట్లు జారీచేయుటకు అనుమతించవలెనని ఇప్పుడు నిర్ణయించబడింది. ఇంతేగాక, సి డిలు జారీచేసినవారు, వాటి చెల్లుబాటు కాలానికి ముందే, కొన్ని నిబంధనలకు లోబడి, తిరిగి కొనుగోలు చేయవచ్చు. IV. చెల్లింపు వ్యవస్థలు 6. వారంలో అన్ని దినాలూ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (ఎన్ ఏ సి హెచ్) పనిచేస్తుంది ఎన్ పి సి ఐ చే నిర్వహించబడుతున్న ఎన్ ఏ సి హెచ్ ఒకరి నుండి-అనేకమందికి చెల్లింపులు (అనగా-డివిడెండ్, వడ్డీ, జీతాలు, పెన్షన్ వంటి చెల్లింపులు మరియు విద్యుత్తు, గ్యాస్, టెలిఫోన్, నీటి బిల్లులు, ఋణ వాయిదాలు, మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడులు, బీమా ప్రీమియంలు వంటి వసూళ్లు) చేయడానికి సహాయపడుతుంది. ఎన్ ఏ సి హెచ్, అనేకమంది లబ్ధిదారులకు, ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూర్చే, ముఖ్యమైన డిజిటల్ వ్యవస్థగా ప్రజాదరణ పొందింది. దీనిద్వారా, కోవిడ్-19 సమయంలో, ప్రభుత్వ రాయితీలు సకాలంలో, పారదర్శకంగా చెల్లించడానికి వీలయింది. ప్రస్తుతం, ఎన్ ఏ సి హెచ్, బ్యాంకులు పనిచేసే రోజుల్లోనే అందుబాటులో ఉంది. వినియోగదారుల సౌకర్యంకోసం మరియు సంవత్సరంలో అన్నిరోజులూ పనిచేసే ఆర్ టి జి ఎస్ వ్యవస్థ ప్రయోజనం పొందుటకు, ఆగస్ట్ 1, 2021 తేదీనుండి, ఎన్ ఏ సి హెచ్ కూడా సంవత్సరంలో అన్నిరోజులూ అందుబాటులో ఉండాలని నిర్ణయించడం జరిగింది. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2021-2022/319 |