<font face="mangal" size="3">పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్  - ఆర్బిఐ - Reserve Bank of India
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్ర –బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 35 A క్రింద నిర్దేశాలు – సొమ్ము ఉపసంహరణ పరిమితి సడలింపు
తేది: 26/09/2019 పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వారి ఆదేశాలు DCBS.CO.BSD-1/D-1/12.22.183/19-20 తేదీ సెప్టెంబర్ 23, 2019 ద్వారా, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 35A (సెక్షన్ 56 తో కలిపి), సబ్-సెక్షన్ (1) క్రింద బహుళ రాష్ట్ర నగర సహకార బ్యాంకు అయిన, పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లి., ముంబై, మహారాష్ట్రను ఖాతాదారుల రక్షణకొరకు, సెప్టెంబర్ 23, 2019 పని ముగింపువేళనుండి, నిర్దేశాల పరిధిలోకి తెచ్చినది. బ్యాంక్ ఆర్థిక లావాదేవీలలో తీవ్రమైన అవకతవకలు, అంతర్గత నియంత్రణా వ్యవస్థలో వైఫల్యం, వివిధ 'ఆఫ్సైట్' నిఘా నివేదికలలో, తప్పు లేక తక్కువ ఎక్స్పోజర్ పరిమితులు నివేదించుట వంటి అక్రమాలు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చినందువల్ల, ఈ నిర్దేశాలు జారీ చేయడం తప్పనిసరి అయింది. అందువల్ల, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949, సెక్షన్ 36AAA (సెక్షన్ 56 తో కలిపి), సబ్-సెక్షన్లు (1) (2), క్రింద, బ్యాంక్ బోర్డ్ను రద్దుచేసి, కార్యనిర్వాహకుడిని (అడ్మినిస్ట్రేటర్) నియమించడం జరిగింది. అడ్మినిస్ట్రేటర్, దీనికి సంబంధించి, అవసరమైన చర్యలు తీసుకొంటున్నారు. అడ్మినిస్ట్రేటర్ తాజాగా సమర్పించిన డిపాజిటర్ మరియు లిక్విడిటీ వివరాల ప్రాథమిక అంచనాల ఆధారంగా, ప్రజాహితంకొరకు, నిర్దేశాలలో మార్పు చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిశ్చయించింది. తదనుసారంగా, ప్రతి సేవింగ్స్ బ్యాంక్ / కరెంట్ అకౌంట్ / ఏదేని ఇతర డిపాజిట్ అకౌంట్నుండి (ఏ పేరుతో పిలువబడినా) రూ 10,000/- (కేవలం పదివేల రూపాయిలు) (ఇంతకు ముందు రూ. 1,000 తీసుకొని ఉంటే, ఆ వెయ్యి రూపాయిలతో కలిపి) మించకుండా ఉపసంహరించుటకు (విత్డ్రావల్) అనుమతిస్తూ, సెప్టెంబర్ 26, 2019 తేదీన మార్పుచేయబడిన నిర్దేశాలు జారీచేయబడినవి. ఆయితే, రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 23, 2019 తేదీన జారీచేసిన నిర్దేశాలలోని, ఇతర నియమ నిబంధనలలో ఎట్టి మార్పు లేదు. పైన తెలిపిన సడలింపు కారణంగా, 60% డిపాజిటర్లు వారి మొత్తం నిల్వ, తిరిగి తీసుకోగలుగుతారు. డిపాజిటర్లకు వారి కష్టాలనుండి కొంత ఊరట కల్గించడానికి పై సడలింపు చేయటం జరిగింది. బ్యాంక్ ఆర్థిక స్థితిని, రిజర్వ్ బ్యాంక్ నిశితంగా పర్యవేక్షిస్తోంది. డిపాజిటర్ల సంక్షేమంకొరకు అవసరమైన చర్యలన్నీ, రిజర్వ్ బ్యాంక్ తీసుకొంటుంది. (యోగేశ్ దయాల్) పత్రికా ప్రకటన: 2019-2020/792 |